రుక్మిణీ కృష్ణుల కుమారుని పేరు ప్రద్యుమ్నుడు. ఆయనయే పూర్వ జన్మలో మన్మథుడు. ఈ మన్మథుని పూర్వము శివుడు కంటిమంటచే తగులబెట్టెను. అతని కిన్నాళ్లును శరీరము లేదు. ఇప్పటికి శరీరము వచ్చెను. మన్మథుడు మిక్కిలి అందగాడు కదా! ప్రద్యుమ్నుడంత యందగా డన్నమాట.
ప్రభావతి వజ్రనాభు డన్న రాక్షసరాజు కూతురు. ఆ రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తన్నెవ్వరు గెలువలే నట్లు వరములు పొందెను. అతడు వజ్రనాభపుర మని యొక పట్టణమును కట్టెను. శత్రువు లైనవా రా పట్టణములోనికి పోవుటకు వీలే లేదు. శివునిభార్యయైన పార్వతీదేని యొక్క దయవలన నీ ప్రభావతి జన్మించెను. పార్వతీదేవి యీ ప్రభావతికి ప్రద్యుమ్నుడు భర్తగా నిర్ణయించెను. వీరు దేవతలు. వారు రాక్షసులు. వజ్రనాభుడు వట్టి రాక్షసుడు కాడు. ఇంద్రునితో నెక్కువగా విరోధపడిన రాక్షసుడు. మరి ఈ ప్రభావతికి ప్రద్యుమ్నునకు పెండ్లి యెట్లు జరుగును? ఈ పెండ్లి జరుగుటమీద ఆ రాక్షసుడు చచ్చుట యాధారపడి యున్నది. దేవతల రాక్షసుల మధ్య శివుడును, విష్ణువును, పార్వతియు నిట్లే సంబంధమును సమకూర్తురు.