తేనె నాలుక మీద వేసుకుంటే ఒక్కసారిగా నోరంతా తియ్యనైపోతుంది, మన ప్రయత్నం ఏమీ అక్కరలేదు. అలాగే మంచి కావ్యం చదివితే చదివిన వెంటనే అర్థమంతా మనస్సులో గుబాళించాలి. అలా కాకుండా గూఢ శబ్దాలు కూర్చి కావ్యం వ్రాస్తే చెవిటివాడూ, మూగవాడూ మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. కవికీ, పాఠకుడికీ మధ్య ఎలాంటి భావ వినిమయమూ జరుగదు.
”తేనె సోఁక నోరు తీయనయగు రీతి తోడ నర్థమెల్ల” తోచేట్టు తేట తెలుగు మాటలతో రామాయణం వ్రాసి, లెక్కకు మిక్కిలిగా ఉన్న తెలుగు రామాయణాలన్నింటిలోకి దాన్ని బహుళ జనాదరపాత్రంగా తీర్చిన మొదటి తెలుగు కవయిత్రి కుమ్మరి మొల్ల.