వైజయంతీ విలాసము హృదయంగమమైన కావ్యము. ఇందు ఋషుల చరిత్రగాని, రాజర్షి చరితగాని, మహావీరుని వృత్తాంతముగాని లేదు; సామాన్యమానవుని జీవితములో ముఖ్యమైన మూడు నాలుగు ఘట్టములు మాత్రము వర్ణింపబడినవి.
సామాన్యముగా ప్రబంధములో కథా కథనము కుటిలముగా నడచి ఉపాఖ్యానములతో, అవాంతర కథలతో నిబిడీకృతమై ఉండును. ఏ తత్కావ్యమున ఆ విధానము కానుపింపదు. కథా కథనము, వస్తునిర్దేశము మొదలు నిర్వహణము వరకును ఋజుసరణిలో నడచును. నడుమలో ఋతు వర్ణనము లున్నను కథోన్మీలనమునకు ఉద్దీపకములై, సుదీర్ఘములు కాక, విసుగు పుట్టింపక, సరసముగనే సాగిపోవును. కథావిధానమునకు ఆదిమధ్యాంతములు సమముగా నుండి తుదకు ఏక వాక్యత సమకూరును.