”రాత్రంతా నాకు నిద్రరాలేదు. మనసునిండా చీకటి. ఆ చీకట్లో నిన్న రాత్రి మనం కన్న ఆ కల ఎక్కడయినా కనిపిస్తుందేమోనని వెలిగించిన ప్రమిదని అరచేతుల్లో పట్టుకుని వెతికాను.
ఎక్కడా కనిపించలేదు మనం ప్రసవించిన ఆ అపురూపమైన కల, చివరికి తెలిసింది నువ్వు లేనప్పుడు ఆ కల నాకెందుకు కనిపిస్తుందీ అన్న సత్యం. చూడూ! నువ్వు నా ఆరోప్రాణం. ఇన్నాళ్ళు ఎలా బ్రతికానో నాకు తెలీదు. నువ్వు లేకుండా ఇక ముందు బతకడం మాత్రం నాకు సాధ్యం కాదు.”
ఆ వెన్నెల రాత్రి వెలగచెట్టు నీడలో అలా చాలాసేపు మాట్లాడింది రాజకుమారి. ‘అంత గొప్పమనిషి అనుకోకుండా నా ప్రాణంలో ప్రాణం అయింది. ఈ మనిషికి దగ్గరయ్యాను. సరే దక్కించుకోగలనా చివరికి?’ అనుకున్నాడు రవ్వలకొండ.
”మా అమ్మ శపథాలు పట్టించుకోకు మావయ్యా! నీ ఊసేత్తితే గోదాట్లో దూకుతానంటది. ఎలకలమందో, గన్నేరుపప్పో తిని చచ్చిపోతానంటది. తనెలా చచ్చినాసరే నిన్ను విడిచిపెట్టను. నీకు తెల్సు మన బంధం ఇప్పటిది కాదు, అసలు ఈ జన్మది కాదు…”
చిన్నప్పటినించీ తనతో కలిసి తిరిగిన తన మేనత్త కూతురు నీలమ్మ అలా అంటుంటే ఏం చెయ్యాలో, అసలామెకి ఎలా సమాధానం చెప్పాలో ఏమాత్రం అర్థంకావడంలేదు రవ్వలకొండకి.
ఆ గదిలోకి లాక్కెళ్ళి తలుపులన్నీ మూసేసిన సావిత్రి కటిక చీకటిగా వున్న ఆ ప్రాంతంలో అమాంతంగా కౌగిలించుకుంది తనని.
లేతగా తాజాగా వున్న తన కింది పెదవిని పళ్ళతో కొరికింది.
ఏ చలనం లేకుండా నిలబడి వున్న తనలో సంచలనం తీసుకురావడం కోసం ”చూడూ! నా కోరిక ఈనాటిది కాదు. ఎన్నాళ్ళనించో నీకోసం తాపత్రయ పడుతూనే వున్నాను. కాదని పారిపోకు. అలా చేస్తే… అలా చేస్తే చాలా ప్రమాదం నీకు” మంద్రస్థాయిలో కవ్విస్తూ, కాస్త బెదిరిస్తూ సావిత్రి అలా పలుకుతుంటే ఏమీ చేయలేని ఒకానొక అయోమయస్థితిలో పడిపోయాడు రవ్వలకొండ.